﻿నిర్గమ.
28.
“నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు. 
అతనికి గౌరవం, వైభవం కలిగేలా నీ సోదరుడు అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించాలి. 
అహరోను నాకు యాజక సేవ జరిగించేలా నీవు అతణ్ణి ప్రత్యేక పరచడం కోసం అతని దుస్తులు కుట్టించాలి. నేను జ్ఞానాత్మతో నింపిన నిపుణులు అందరికీ ఆజ్ఞ జారీ చెయ్యి. 
వారు కుట్టవలసిన దుస్తులు ఇవి. వక్ష పతకం, ఏఫోదు, నిలువుటంగీ, రంగు దారాలతో కుట్టిన చొక్కా, తల పాగా, నడికట్టు. అతడు నాకు యాజకుడై యుండేలా వారు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు ప్రతిష్ఠిత దుస్తులు కుట్టించాలి. 
కళాకారులు బంగారు, నీల, ధూమ్ర, రక్త వర్ణాలు గల నూలును సన్ననారను దీనికి ఉపయోగించాలి. 
బంగారం నీల ధూమ్ర రక్త వర్ణాల ఏఫోదును పేనిన సన్న నారతో కళాకారుని నైపుణ్యంతో చెయ్యాలి. 
రెండు భుజాలకు సరిపడేలా రెండు పై అంచుల్లో కూర్చిన పట్టీలు దానికి ఉండాలి. 
ఏఫోదుపై ధరించడానికి పనితనంతో చేసిన నడికట్టు ఏకాండంగా ఉండి, బంగారంతో, నీల, ధూమ్ర, రక్త వర్ణాల నూలుతో, పేనిన సన్ననారతో కుట్టాలి. 
నీవు రెండు లేత పచ్చలను తీసుకుని వాటి మీద ఇశ్రాయేలీయుల పేర్లను అంటే వారి పుట్టుక క్రమం చొప్పున 
ఒక రత్నం మీద ఆరు పేర్లు, రెండవ రత్నం మీద తక్కిన ఆరు పేర్లను చెక్కించాలి. 
ముద్ర మీద చెక్కిన పనిలాగా ఆ రెండు రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్లు చెక్కి బంగారు కుదురుల్లో వాటిని పొదగాలి. 
అప్పుడు ఇశ్రాయేలీయులకు స్మారక సూచకమైన ఆ రెండు రత్నాలను ఏఫోదు భుజాలపై నిలపాలి. ఆ విధంగా అహరోను తన రెండు భుజాలపై యెహోవా సన్నిధిలో జ్ఞాపక సూచనగా ఆ పేర్లను ధరిస్తాడు. 
బంగారు కుదురులను తయారు చెయ్యాలి. 
మేలిమి బంగారంతో రెండు అల్లిక గొలుసులను చెయ్యాలి. ఆ అల్లిక పనికి అల్లిన గొలుసులను తగిలించాలి. 
కళాకారుని నైపుణ్యంతో న్యాయనిర్ణయ పతకాన్ని చెయ్యాలి. ఏఫోదు పని లాగా దాన్ని చెయ్యాలి. బంగారంతో, నీల ధూమ్ర రక్త వర్ణాల నూలుతో పేనిన సన్ననారతో దాన్ని చెయ్యాలి. 
నలుచదరంగా ఉన్న ఆ పతకాన్ని మడత పెట్టాలి. దాని పొడవు జానెడు, వెడల్పు జానెడు ఉండాలి. 
దానిలో నాలుగు వరసల్లో రత్నాలుండేలా రత్నాల కుదుర్లు చెయ్యాలి. మొదటి వరస మాణిక్యం, గోమేధికం, మరకతం. 
రెండో వరస పద్మరాగం, నీలం, వజ్రం. 
మూడవది గారుత్మతం, యష్మురాయి, ఇంద్రనీలం. 
నాలుగవ వరస గరుడ పచ్చ, సులిమాని రాయి, సూర్యకాంతం. వాటిని బంగారు కుదురుల్లో పొదగాలి. 
ఆ రత్నాలపై ఇశ్రాయేలీయుల పేర్ల ప్రకారం పన్నెండు పేర్లు ఉండాలి. ముద్ర మీద చెక్కినట్టు వారిలో ఒక్కొక్క పేరు చొప్పున పన్నెండు గోత్రాల పేర్లు ఉండాలి. 
ఆ పతకాన్ని అల్లిక పనిగా పేనిన గొలుసులతో మేలిమి బంగారంతో చెయ్యాలి. 
పతకానికి రెండు బంగారు రింగులు చేసి 
ఆ రెండు రింగులను పతకపు రెండు కొసలకు అల్లిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలించాలి. 
అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు కుదురులకు తగిలించి ఏఫోదు ముందు వైపు భుజాలపై కట్టాలి. 
నీవు బంగారంతో రెండు రింగులు చేసి ఏఫోదు ముందు భాగంలో పతకం లోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలించాలి. 
నీవు రెండు బంగారు రింగులు చేసి ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుపై దాని ముందు వైపు కింది భాగంలో ఏఫోదు రెండు భుజాలకు వాటిని తగిలించాలి. 
అప్పుడు పతకం ఏఫోదు నమూనా ప్రకారం చేసిన నడికట్టుకు పైగా ఉండేలా బిగించాలి. అది ఏఫోదునుండి విడిపోకుండా ఉండేలా వారు దాని రింగులను నీలి దారంతో కట్టాలి. 
ఆ విధంగా అహరోను పరిశుద్ధ స్థలం లోకి వెళ్ళినప్పుడల్లా అతడు తన రొమ్ము మీద న్యాయనిర్ణయ పతకంలోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యం యెహోవా సన్నిధిలో జ్ఞాపకార్థంగా ధరించాలి. 
నీవు ఈ న్యాయనిర్ణయ పతకంలో ఊరీము తుమ్మీము అనే వాటిని ఉంచాలి. అహరోను యెహోవా సన్నిధికి వెళ్లినప్పుడల్లా అవి అతని రొమ్ముపై ఉంటాయి. అతడు యెహోవా సన్నిధిలో తన రొమ్ముపై ఇశ్రాయేలీయుల న్యాయనిర్ణయాలను నిత్యం భరిస్తాడు. 
ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి. 
దాని మధ్య భాగంలో తల దూర్చడానికి రంధ్రం ఉండాలి. అది చినిగి పోకుండా మెడ కవచం లాగా దాని రంధ్రం చుట్టూ నేతపని గోటు ఉండాలి. 
దాని అంచుల చుట్టూ నీల ధూమ్ర రక్త వర్ణాల దానిమ్మ కాయ ఆకారాలను, వాటి మధ్యలో బంగారు గంటలను నిలువు టంగీ చుట్టూ తగిలించాలి. 
ఒక్కొక్క బంగారు గంట, దానిమ్మకాయ ఆ నిలువుటంగీ కింది అంచున చుట్టూరా ఉండాలి. 
సేవ చేసేటప్పుడు అహరోను దాని ధరించాలి. అతడు యెహోవా సన్నిధిలో పరిశుద్ధస్థలం లోకి ప్రవేశించేటప్పుడు అతడు చావకుండేలా వాటి చప్పుడు వినబడుతూ ఉండాలి. 
నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్టు దానిపై ‘యెహోవాకు పరిశుద్ధం’ అనే మాట చెక్కాలి. 
పాగాపై ఉండేలా నీలి దారంతో దాన్ని కట్టాలి. అది పాగా ముందు వైపు ఉండాలి. 
ఇశ్రాయేలీయులు అర్పించే పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో వాటిలో ఇమిడి ఉన్న దోషాలను అహరోను భరించేలా అది అహరోను నుదిటిపై ఉండాలి. వారికి యెహోవా సన్నిధిలో ఆమోదం ఉండేలా అది నిత్యం అతని నుదుటిపై ఉండాలి. 
సన్న నారతో చొక్కాయిని బుట్టాపనిగా చెయ్యాలి. సన్న నారతో పాగాను నేయాలి. నడికట్టును కూడా బుట్టాపనిగా చెయ్యాలి. 
నీవు అహరోను కుమారులకు చొక్కాలు కుట్టించాలి. వారికి నడికట్లు తయారు చెయ్యాలి. వారి ఘనత, వైభవాలు కలిగేలా వారికీ టోపీలు చెయ్యాలి. 
నీవు నీ సోదరుడు అహరోనుకు, అతని కుమారులకు వాటిని తొడిగించాలి. వారు నాకు యాజకులయ్యేలా వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠించి పవిత్రపరచాలి. 
వారి నగ్నతను కప్పుకొనేందుకు నీవు వారికి నారతో చేసిన లోదుస్తులు కుట్టించాలి. 
వారు ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించేటప్పుడు గానీ పరిశుద్ధస్థలం లో సేవ చేయడానికి బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడు గానీ వారు దోషులై చావకుండేలా అహరోను, అతని కుమారులు వాటిని ధరించాలి. ఇది అతనికి, అతని తరువాత అతని సంతానానికి ఎప్పటికీ నిలిచి ఉండే శాసనం.” 
