﻿కీర్తన.
2.
జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్ధమైన కుట్ర చేస్తున్నాయి? 
భూరాజులు కుమ్మక్కై యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ విరోధంగా నిలబడ్డారు. పాలకులు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు. 
వాళ్ళు మనకు వేసిన సంకెళ్ళు తెంపేద్దాం రండి. వాళ్ళ గొలుసులు విసిరి పారేద్దాం రండి, అని చెప్పుకుంటున్నారు. 
ఆకాశాల్లో కూర్చున్నవాడు వెక్కిరిస్తున్నాడు. ప్రభువు వాళ్ళను చూసి హేళన చేస్తున్నాడు. 
ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు. విపరీతమైన కోపంతో వాళ్ళను భయభీతులకు గురి చేస్తాడు 
నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను. 
యెహోవా శాసనాన్ని నేను ప్రకటిస్తాను. యెహోవా నాకు ఇలా చెప్పాడు, నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను. 
నన్ను అడుగు. జాతులను నీకు వారసత్వంగానూ భూమిని దాని సుదూర ప్రాంతాల వరకూ నీ ఆస్తిగానూ ఇస్తాను. 
ఇనపదండంతో నువ్వు వాళ్ళను నలగగొడతావు, మట్టి కుండలాగా వాళ్ళను ముక్కలు చెక్కలు చేస్తావు. 
కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. 
భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి. 
దేవుడు కుమారుని పక్షం చేరండి. అప్పుడు దేవుడు మీపై కోపించడు. ఆయన కోపం త్వరగా రగులుకున్నప్పుడు మీరు చనిపోరు. దేవునిలో ఆశ్రయం పొందినవాళ్ళు ధన్యులు. 
