﻿సామెత.
19.
బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప. 
ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు. 
ఒకడి మూర్ఖత్వం వాడి బ్రతుకును ధ్వంసం చేస్తుంది. అలాటి వాడు యెహోవా మీద మండిపడతాడు. 
సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు. 
అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు. 
ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే. 
పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు. 
బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు. 
అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు. 
బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు. 
విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత. 
రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది. 
మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం. 
ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే. 
సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు. 
ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు. 
పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు. 
అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు. 
పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది. 
సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు. 
మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి. 
మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు. 
యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు. 
సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు. 
హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు. 
తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు, అపకీర్తి తెచ్చే కొడుకు. 
కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు. 
చెడిపోయిన సాక్షి న్యాయాన్ని గేలి చేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జుర్రుకుంటుంది. 
అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు. 
